ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నాం: సీఎం చంద్రబాబు

  • ఏపీలో 5 రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం పర్యటన
  • సింగపూర్ ను అత్యంత విలువైన భాగస్వామిగా పేర్కొన్న చంద్రబాబు
  • బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆశాభావం 
ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం నేడు సింగపూర్ వెళుతోంది. ఈ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని వెల్లడించారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. 

"రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోంది. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. 

మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా, సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు కూడా వెళుతున్నారు. 


More Telugu News