ఐర్లాండ్ అంత సేఫ్ కాదు.. అమెజాన్ ఉద్యోగిపై జాత్యహంకార దాడి తర్వాత భారతీయుడి వైరల్ పోస్ట్

  • ఈ నెల 19న భారతీయుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి
  • జాత్యహంకార దాడేనన్న స్థానిక మహిళ
  • అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని టాలాట్ ప్రాంతంలో ఈ నెల 19న సాయంత్రం జరిగిన జాత్యహంకార దాడి అక్కడి భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. అమెజాన్ ఉద్యోగి అయిన ఒక భారతీయుడి(40)పై టీనేజర్ల గుంపు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసింది. ఈ ఘటన తర్వాత దక్ష్ అనే భారతీయుడు సోషల్ మీడియాలో "ఐర్లాండ్ ఇక సురక్షితం కాదు, ఇక్కడికి రాకండి" అని హెచ్చరిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది.

ఈ నెల 19న సాయంత్రం 6 గంటల సమయంలో టాలాట్‌లోని పార్క్‌హిల్ రోడ్డులో ఈ దాడి జరిగింది. బాధితుడు ఐర్లాండ్‌కు వచ్చి కేవలం మూడు వారాలు మాత్రమే అవుతోంది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావంతో రోడ్డుపై పడి వున్న అతడిని చూసిన స్థానిక మహిళ జెన్నిఫర్ మర్రే అంబులెన్స్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది కచ్చితంగా జాత్యహంకార దాడేనని ముర్రే పేర్కొన్నారు.

బాధితుడు టాలాట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనను గార్డా (ఐరిష్ పోలీసులు) హేట్ క్రైమ్‌గా దర్యాప్తు చేస్తోంది. "టాలాట్ ప్రాంతంలో ఇటీవల విదేశీయులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి" అని ది ఐరిష్ టైమ్స్ నివేదించింది. భారత రాయబారి అఖిలేష్ మిశ్రా ఈ దాడిని ‘భయంకరం’గా అభివర్ణించారు. ఈ దాడి స్థానిక భారతీయ సమాజంలో భయాందోళనలను కలిగించిందని మిశ్రా తెలిపారు.

ఐర్లాండ్‌లో పెరుగుతున్న జాత్యహంకార దాడులు 
ఈ ఘటన ఐర్లాండ్‌లో ఇటీవల పెరిగిన వలసదారుల వ్యతిరేక భావనలు, జాత్యహంకార దాడుల నేపథ్యంలో జరిగింది. దక్ష్ తన వైరల్ పోస్ట్‌లో, "జాత్యహంకారవాదులు ఐర్లాండ్‌లో స్వల్ప సంఖ్యలో ఉన్నప్పటికీ, వారు ఇప్పుడు ప్రమాదకరంగా మారారు" అని పేర్కొన్నాడు. ఈ దాడిని నిరసిస్తూ, వలసదారులకు సంఘీభావం తెలపడానికి నేడు టాలాట్‌లో యాంటీ-రేసిజం, ప్రో-మైగ్రెంట్ సంస్థలు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నాయి.


More Telugu News