యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం

  • ఖైతాపురం వద్ద హైవేపై లారీని ఢీకొట్టిన‌ స్కార్పియో 
  • ఇద్ద‌రు అక్కడికక్కడే మృతి.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు
  • మృతుల‌ను ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్‌ రావు, కాంతారావుగా గుర్తింపు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని ఖైతాపురం వద్ద హైవేపై స్కార్పియో కారు ఓ లారీని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న‌లుగురిలో ఇద్ద‌రు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ప్ర‌మాదాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం స‌మీపంలోని ఆసుప‌త్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్‌ రావు, కాంతారావుగా గుర్తించారు. 

ఏపీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో వారు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంద‌ని పోలీసులు వెల్లడించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




More Telugu News