మిడ్ ఎయిర్ మిరాకిల్.. ఎయిర్ ఇండియా విమానంలో 35 వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

  • మస్కట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం
  • మార్గమధ్యంలో థాయ్ మహిళకు పురిటినొప్పులు
  • ఆమె గోప్యతను కాపాడుతూ పురుడుపోసిన విమాన సిబ్బంది
మస్కట్ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గురువారం ఉదయం ఒక థాయిలాండ్ మహిళా ప్రయాణికురాలు బాలుడికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు సహాయంతో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది.

ఎయిర్‌లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. 29 ఏళ్ల థాయిలాండ్ జాతీయురాలు ప్రసవ వేదనలోకి వెళ్లిన వెంటనే, క్యాబిన్ క్రూ వేగంగా స్పందించారు. తల్లి, బిడ్డ గోప్యతను కాపాడటానికి ప్రయాణికుల సీట్లు మార్చారు. అలాగే ఫోన్‌లను పక్కన పెట్టమని సూచించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:15 గంటలకు, 35,000 అడుగుల ఎత్తులో ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

విమాన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విషయాన్ని వివరించారు. విమానం ఉదయం 4:02 గంటలకు ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే తల్లి, బిడ్డను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సహాయం అందించడానికి ఒక మహిళా ఎయిర్‌లైన్ సిబ్బంది కూడా ఆసుపత్రికి వెళ్లారు.

కాన్సులేట్‌తో సంప్రదింపులు
‘‘మహిళ, ఆమె బిడ్డ థాయిలాండ్‌కు ప్రయాణించేందుకు అవసరమైన సాయం అందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముంబైలోని థాయిలాండ్ కాన్సులేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతోంది’’అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆ మహిళకు భారతదేశ వీసా లేదు. అదే రాత్రి ఆమె బ్యాంకాక్‌కు వెళ్లే కనెక్టింగ్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా థాయిలాండ్ కాన్సులేట్ జనరల్‌తో సంప్రదించింది.


More Telugu News