తెలంగాణ‌లో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

  • బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ ఉపరితల ద్రోణి 
  • రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్న‌ వాతావరణ కేంద్రం
  • ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడురోజులు విస్తారంగా వ‌ర్షాలు
బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

అలాగే జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల,  నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఇక‌, రేపు కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఎల్లుండి నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి,  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.


More Telugu News