ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • ఏపీ లిక్కర్ స్కాంలో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయన్న సోమిరెడ్డి
  • ఈ కుంభ‌కోణంపై ఈడీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్
  • వైసీపీ నేతల క‌రప్ష‌న్ దేశ సరిహద్దులు దాటింద‌ని వ్యాఖ్య‌
  • ఈ స్కాంను దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడ‌ల్స్‌ ఇవ్వాలని ఎద్దేవా
ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన ముష్క‌రులపై తీసుకున్న చర్యలు చూశామ‌న్న ఆయ‌న‌... అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాల‌ని ప్రజలు కోరుతున్నారన్నారు.

ఇక‌, ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటార‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ, లిక్కర్ స్కాంలో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు, కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతోంది. అలాగే ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కాంపై విచారణ జరగాలని కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల క‌రప్ష‌న్ దేశ సరిహద్దులు దాటింద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాంను దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడ‌ల్స్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే, అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించింది. అలాగే ఏపీ మద్యం స్కాంపై కూడా విచారణ చేయాలన్నారు. 


More Telugu News