భర్త వివాహేతర సంబంధం.. అత్తింటి వేధింపులతో డెంటిస్ట్ ఆత్మహత్య

  • హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో ఘటన
  • ప్రత్యూషకు డాక్టర్ సృజన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం
  • వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రత్యూషను వేధించిన భర్త
  • కొడుకుకు మద్దతు పలికిన అత్తమామలు
  • మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ప్రత్యూష
  • ప్రత్యూషను చంపి హత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ
హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో అత్తింటి వేధింపులు భరించలేక ఓ దంత వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం, ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన డాక్టర్ సృజన్‌తో వరంగల్‌కు చెందిన దంత వైద్యురాలు ప్రత్యూషకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం హైదరాబాద్‌లో నివాసం ఉన్న వీరు, గత ఏడాది హసన్‌పర్తిలోని కాకతీయ వింటేజ్ విల్లాస్‌లో స్థిరపడ్డారు.

సృజన్‌కు హన్మకొండకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ప్రత్యూషను మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. అత్తామామలు కూడా కుమారుడికే మద్దతుగా నిలిచి కోడలు ప్రత్యూషను వేధించడం మొదలుపెట్టారు.

దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన భర్త, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రత్యూష ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.


More Telugu News