విమానం టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్‌లు ఆఫ్!

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి
  • ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశావంటూ మరో పైలట్‌ను ప్రశ్నించిన పైలట్
  • కాక్‌పిట్‌లో రికార్డయిన చివరి మాటలు ఇవే
  • ఏఏఐబీ దర్యాప్తు నివేదికలో వెల్లడి
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడు. దీనికి తాను ఆఫ్ చేయలేదని అతడు సమాధానమిచ్చాడు. కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకున్న చివరి మాటలు ఇవే. ఆ తర్వాత పైలట్ల నుంచి మేడే కాల్ వచ్చిందని విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపిన ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో’(ఏఏఐబీ) పేర్కొంది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను విడుదల చేసింది..

పైలట్లు ఇచ్చిన మేడే కాల్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఈలోపే విమానం కూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తిచేసినట్టు తెలిపింది. అలాగే, విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్లను వెలికి తీసినట్టు పేర్కొంది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లో ఉన్నాయని వివరించింది. అలాగే, విమానంలో ప్రమాదకర వస్తువులు ఏమీ లేవని ఏఏఐబీ తన నివేదికలో పేర్కొంది.


More Telugu News