Vijayasai Reddy: వెంటాడుతున్న ఏపీ లిక్కర్ స్కాం... విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు

Vijayasai Reddy Facing Fresh Notices in AP Liquor Scam
షార్ట్స్‌లో చూడండి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 12వ తేదీన ఉదయం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్, లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ కేసులో విజయసాయి రెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నారు. అయితే, తాను నిందితుడిని కాదని, కేవలం ఒక "విజిల్‌బ్లోయర్‌"నని ఆయన వాదిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయనను అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన రెండు సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు అప్పట్లో ఆయన అంగీకరించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి (ఏ1), మద్యం కంపెనీల నుంచి సుమారు రూ. 50-60 కోట్లు లంచంగా వసూలు చేసి, ఆ నిధులను విజయసాయి రెడ్డి సహా పలువురు ప్రముఖులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హవాలా నెట్‌వర్క్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి చెబుతున్నారు.

మరోవైపు, రెండు మద్యం సరఫరా కంపెనీలకు సిఫారసు చేసిన విషయాన్ని, వాటికి ఓ ఫార్మా సంస్థ నుంచి రూ. 100 కోట్ల రుణం ఇప్పించడంలో సహాయం చేశానని విజయసాయి రెడ్డి అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2019-24 మధ్య జరిగిన మద్యం అమ్మకాల్లో అత్యధికంగా నగదు రూపంలోనే లావాదేవీలు జరగడంపై ఈడీ దృష్టి సారించింది.
Go Back to Shorts
Vijayasai Reddy
AP Liquor Scam
Andhra Pradesh
Excise Policy
Special Investigation Team
Raj Kasireddy
Enforcement Directorate
Money Laundering

More Telugu News