LIC: ఎల్‌ఐసీలో మరో విడత వాటాల విక్రయానికి కేంద్రం సన్నాహాలు

Government Plans Further LIC Stake Sale
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో మరోసారి వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో ఈ విక్రయ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపమ్) ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

2022 మే నెలలో తొలిసారి ఐపీఓ ద్వారా కేంద్రం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒక్కో షేరుకు రూ.902 నుంచి రూ.949 ధరల శ్రేణిని నిర్ణయించగా, ప్రభుత్వం సుమారు రూ.21 వేల కోట్లను సమీకరించింది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది.

సెబీ నిబంధనల ప్రకారం, 2027 మార్చి 16 నాటికి లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం 10 శాతానికి చేరాల్సి ఉంది. ఈ నిబంధనను అందుకునేందుకు కేంద్రం మరో 6.5 శాతం వాటాను విక్రయించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే తాజా వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ విడతలో ఎంత శాతం వాటాను, ఏ ధరకు, ఎప్పుడు విక్రయిస్తారనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్ విలువ సుమారు రూ.5.85 లక్షల కోట్లుగా ఉండగా, షేరు ధర రూ.926 వద్ద ట్రేడ్ అవుతోంది.
Go Back to Shorts
LIC
Life Insurance Corporation
LIC IPO
Government stake sale
Offer for sale
Share sale

More Telugu News