మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి’... రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా విడుదల

  • పదేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి చిత్రం
  • రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేసేందుకు నిర్ణయం
  • 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు
  • అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్
  • సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్
  • ప్రశ్న, సమాధానం ఒకేసారి వస్తున్నాయంటూ పోస్టులు
భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ సంయుక్త భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. "పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న, సమాధానం రెండూ కలిసి ఒకే గ్రాండ్ ఎపిక్‌గా వస్తున్నాయి" అంటూ ప్రభాస్ పేర్కొన్నారు. ఎన్నో జ్ఞాపకాలు, అంతులేని స్ఫూర్తినిచ్చిన ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు.

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా చూడాలన్న అభిమానుల కోరిక ఈ రీ-రిలీజ్‌తో నెరవేరనుంది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత కూడా అదే ఆదరణతో ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.


More Telugu News