Nara Lokesh: విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో లోకేశ్ ముఖాముఖి

Nara Lokesh Interacts with Students and Parents in Puttaparthi
షార్ట్స్‌లో చూడండి
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేశ్ ఈ రోజు పుట్టపర్తికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంత్రి లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కొత్త చెరువు బీసీ కాలనీకి చెందిన పి.మాధవికి ఎనిమిదో తరగతి చదివే బాలు, ఏడో తరగతి చదివే నరసమ్మ, ఐదో తరగతి చదివే బేబీ, మూడో తరగతి చదివే సన అనే నలుగురు పిల్లలు ఉన్నారు. మాధవి నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందింది. ఈ సందర్భంగా మాధవితో మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు.

అనంతరం మాధవి మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకం కింద తమకు రూ.52 వేల సాయం అందిందని, ఆ మొత్తాన్ని పిల్లల పేరుమీద బ్యాంకులో వేశామని మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తంచేస్తూ.. పిల్లలను బాగా చదివించాలని, వారి ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటామని మాధవికి హామీ ఇచ్చారు. మధాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని, పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చామని, వర్క్ బుక్ లు అందజేశామని మంత్రి వివరించారు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని పిల్లలకు సూచించారు. కాగా, తల్లికి వందనం కింద నలుగురు పిల్లలకు సాయం అందించడంతో పాటు.. మంత్రి నారా లోకేశ్ తమ పట్ల చూపించిన ఆప్యాయత పట్ల మాధవి, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Talli ki Vandanam
Andhra Pradesh Education
Puttaparthi
Student Welfare
Education Scheme
AP Government
Financial Assistance
School Children
Jagan Mohan Reddy

More Telugu News