జగన్ పర్యటనలో మామిడి కాయలు పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగింది: నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు

  • తుమ్మలపాలెం అడ్వకేట్ ఆధ్వర్యంలో కుట్ర జరిగిందన్న మనోహర్
  • డ్రైవర్లే ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడి
  • శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య
ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారని ఆయన తెలిపారు. శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను జగన్ పరామర్శించడానికి వెళ్లినప్పుడు కావాలని మామిడి కాయలను వాహనాల కింద వేసి తొక్కించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. "దేవేంద్ర అనే న్యాయవాది తుమ్మలపాలెం నుంచి ఐదు ట్రాక్టర్‌ల లోడ్‌ను తెప్పించారు. జగన్ వాహనం వచ్చినప్పుడు రోడ్డుపై వేయాలని అతను నిందితులకు సూచించాడు. ఇందుకోసం రిహార్సల్స్ కూడా చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ట్రయల్ రన్ నిర్వహించి మరీ జగన్ వాహనం వచ్చినప్పుడు సరుకును తీసుకు వచ్చి వేయమని చెప్పారని అంగీకరించారు" అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

డ్రోన్ ఫుటేజీ చూసినా మామిడి తోట నుంచి ఐదు లోడ్‌ల  మామిడి కాయలను తీసుకువచ్చి, రోడ్డు మీద సరుకు వేయడం కనిపిస్తోందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News