ఇద్దరు భార్యల చేతిలో భర్త హతం
- మొదటి భార్య తల్లిని హత్య చేసి పరారీలో ఉన్న కనకయ్య
- భార్యలనూ చంపుతానని గొడ్డలితో వచ్చిన కనకయ్యను సోదరుల సాయంతో హత మార్చిన ఇద్దరు భార్యలు
- జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో ఘటన
మద్యానికి బానిసైన కనకయ్య తరచూ ఇద్దరు భార్యలను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో మే 18న కనకయ్య తన అత్తామామలైన జున్నూబాయి, చిన్నరాజయ్యపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జున్నూబాయి మృతి చెందగా, చిన్న రాజయ్య గాయాలతో బయటపడి చికిత్స పొందాడు. అప్పటి నుంచి కనకయ్య పరారీలో ఉన్నాడు. భార్యలిద్దరూ పుట్టిళ్లలో తలదాచుకుంటున్నారు.
పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న కనకయ్య సోమవారం రాత్రి గ్రామానికి వచ్చి భార్యలిద్దరినీ చంపేస్తానంటూ గొడ్డలితో బెదిరించాడు. దీంతో తన తల్లిని హత్య చేశాడన్న కోపంతో ఉన్న మొదటి భార్య చుక్కమ్మ అదే గొడ్డలితో కనకయ్యపై ఎదురుదాడి చేసింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రెండో భార్య గౌరమ్మ, ఆమె సోదరులైన జనార్ధన్, శ్రీనివాస్ సహకారంతో కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.