శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

  • శ్రీరాముడి జన్మస్థానంపై మరోసారి నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
  • రాముడు పుట్టింది నేపాల్‌లోనేనని స్పష్టం చేసిన కేపీ ఓలీ
  • వాల్మీకి రామాయణమే ఇందుకు ఆధారమని వెల్లడి
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామచంద్రుడు భారతదేశంలోని అయోధ్యలో కాకుండా, తమ దేశమైన నేపాల్‌లోనే జన్మించారని ఆయన పునరుద్ఘాటించారు. ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వాదనను వినిపించారు.

తాను సొంతంగా ఈ మాటలు చెప్పడం లేదని, వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానని కేపీ ఓలీ స్పష్టం చేశారు. రాముడు పుట్టిన నిజమైన ప్రదేశం నేపాల్‌లోనే ఉందని, ఈ నిజాన్ని ప్రచారం చేయడానికి ప్రజలు ఏమాత్రం వెనుకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో 2020లో కూడా ఓలీ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ దేశంలోని చిత్వాన్‌ జిల్లా థోరి ప్రాంతమే అసలైన అయోధ్య అని, అక్కడే రాముడు జన్మించారని అప్పట్లో పేర్కొన్నారు. కేవలం రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని ఓలీ తాజాగా తెలిపారు. ఇతిహాసాల్లో పేర్కొన్న పలు ప్రదేశాలు ప్రస్తుతం నేపాల్‌లోని సున్‌సారి జిల్లాలో ఉన్నాయని ఆయన అన్నారు. 


More Telugu News