India vs England: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు.. మూడో రోజూ టీమిండియాదే హవా.. భారీ ఆధిక్యంలో భార‌త్‌

Mohammed Siraj Shines India Dominate Edgbaston Test Day 3
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఓ దశలో జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (158) అద్భుత శతకాలతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నప్పటికీ, పేసర్ మహ్మద్ సిరాజ్ (6/70) నిప్పులు చెరిగే బంతులతో ఆతిథ్య జట్టును కుప్పకూల్చాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 244 పరుగుల భారీ ఆధిక్యంతో పటిష్ఠ‌ స్థితిలో నిలిచింది.

శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సిరాజ్ ఒకే ఓవర్‌లో జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ను 84/5తో కష్టాల్లోకి నెట్టాడు. అయితే, ఈ దశలో క్రీజులో కలిసిన స్మిత్, బ్రూక్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. స్మిత్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా, బ్రూక్ దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

భారీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ పటిష్ఠ‌ స్థితిలో నిలిచింది. ఈ క్ర‌మంలో నిలకడగా ఆడుతున్న బ్రూక్‌ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత సిరాజ్ విజృంభించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 387/5తో ఉన్న ఇంగ్లండ్ కేవలం 20 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయి 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. యశస్వి జైస్వాల్ (28) ఔటైనప్పటికీ, కేఎల్ రాహుల్ (28 నాటౌట్) క్రీజులో నిలదొక్కుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (7) రాహుల్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు.
Go Back to Shorts
India vs England
Mohammed Siraj
Edgbaston Test
Jamie Smith
Harry Brook
Indian Cricket Team
England Cricket Team
Test Match
Cricket
Yashasvi Jaiswal

More Telugu News