రూటు మార్చిన డ్రాగన్.. మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు!

తీవ్రమవుతున్న జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పిల్లల్ని కనే జంటలకు లక్షల్లో నగదు బహుమతులు అందిస్తూ ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చైనాలోని పలు నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇన్నర్ మంగోలియాలోని హోహోట్ నగరంలో మూడో బిడ్డకు జన్మనిస్తే ఏకంగా లక్ష యువాన్లు (సుమారు రూ.12 లక్షలు) అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని పదేళ్లపాటు విడతలవారీగా చెల్లిస్తారు. అదే రెండో బిడ్డకు 50 వేల యువాన్లు, మొదటి బిడ్డకు 10 వేల యువాన్లు ఇస్తున్నారు. వీటితో పాటు ఉచిత వైద్య పరీక్షలు, ఏడాది పాటు పాలు వంటి అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు.

సెంట్రల్ చైనాలోని టియాన్మెన్ నగరంలోనూ రెండో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు నగదు సాయంతో పాటు, చిన్నారికి మూడేళ్లు వచ్చేవరకు నెలనెలా భత్యం ఇస్తున్నారు. మూడో బిడ్డ పుడితే ఈ భత్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక సబ్సిడీ కూడా అందిస్తుండటం విశేషం. ఈ పథకాల ప్రభావంతో ఆ నగరంలో గతేడాది జననాల రేటు 17 శాతం పెరిగినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.

దశాబ్దాల పాటు కఠినంగా అమలు చేసిన 'ఒకే బిడ్డ' విధానాన్ని 2016లో రద్దు చేసినప్పటికీ, చైనాలో జననాల రేటు పడిపోతూనే ఉంది. 2016లో 1.8 కోట్లుగా ఉన్న జననాల సంఖ్య, గతేడాదికి 95 లక్షలకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 80 కోట్లకు పడిపోవచ్చని ఐక్యరాజ్యసమితి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే చైనా ప్రభుత్వం ఈ భారీ ప్రోత్సాహకాల మార్గాన్ని ఎంచుకుంది.

China population
China birth rate
Chinese government
population crisis
birth incentives
third child subsidy
Hohhot city
Tianmen city
one child policy
China demographic crisis

More Telugu News