తిమ్మరాజుపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కారం

సీఎం చంద్రబాబు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తిమ్మరాజుపల్లి గ్రామంలో సుదీర్ఘంగా పర్యటించారు. సుమారు రెండున్నర గంటల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.

గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాల గురించి గ్రామస్థులకు ఓపికగా వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమ సమస్యలను సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెబుతున్న ప్రతీ సమస్యను సావధానంగా విన్న ఆయ‌న‌, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గ్రామంలోని కొందరు రైతులు పశువులను పెంచుకోవడానికి తమ ఇళ్ల వద్ద తగినంత స్థలం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించిన ఆయన, గ్రామంలోని పశువులన్నింటికీ కలిపి ఒకేచోట ఉమ్మడి షెడ్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, పశువుల మేతకు అవసరమైన వనరులను కూడా సమకూర్చాలని సూచించారు.

అలాగే గ్రామంలో తాగు, సాగునీటి కోసం మరిన్ని బోర్లను ఏర్పాటు చేయాలని పలువురు గ్రామస్థులు సీఎంను కోరారు. వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు, అవసరమైన చోట్ల వెంటనే బోర్లు వేయించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పర్యటనలో భాగంగా మరికొందరు గ్రామస్థులు తమ పిల్లల చదువుల గురించి ప్రస్తావిస్తూ, వారికి కాలేజీల్లో సీట్లు ఇప్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి వినతులను ఆయన స్వీకరించారు. సీఎం నేరుగా తమ గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, వాటి పరిష్కారానికి తక్షణ ఆదేశాలు ఇవ్వడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


Chandrababu
Andhra Pradesh
Timmarajupalli
village visit
public grievances
government schemes
drinking water
irrigation
cattle shed
education

More Telugu News