Telangana Government: ఇంజినీరింగ్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Government Key Decision on Engineering Fees
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లయింది.

ఈ ఉత్తర్వులు బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, బి-ఒకేషనల్ వంటి అన్ని రకాల ఇంజినీరింగ్ కోర్సులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీలలో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల ఖరారుకు ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియమించిన కమిటీ నివేదిక రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, ఫీజుల నిర్ణయం ఆలస్యమైతే ఎప్‌సెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై ప్రభావం పడుతుందని ఉన్నత విద్యామండలి అధికారులు భావించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సకాలంలో ప్రారంభించేందుకు, పాత ఫీజుల (గరిష్ఠంగా రూ.1.65 లక్షలు) ప్రకారమే అడ్మిషన్లు చేపట్టాలని యోచించారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ఫీజులనే కొనసాగిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. వారికి కూడా పాత ఫీజులనే వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరపడటంతో పాటు, కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
Go Back to Shorts
Telangana Government
Engineering Fees
Telangana
B.Tech
EAMCET
Revanth Reddy

More Telugu News