సార్క్‌కు పోటీగా చైనా-పాక్ కొత్త కూటమి ఎత్తుగడ.. ఖండించిన బంగ్లాదేశ్

  • సార్క్‌కు పోటీగా కొత్త కూటమి ఏర్పాటుకు చైనా, పాకిస్థాన్ ప్రయత్నాలు
  • ఇటీవల చైనాలో బంగ్లాదేశ్ ప్రతినిధులతో రహస్యంగా చర్చలు
  • కొత్త కూటమి వార్తలను ఖండించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
  • పనిచేయకుండా ఉన్న సార్క్‌ను పూర్తిగా పక్కనపెట్టేందుకే ఈ ప్లాన్
  • కొత్త గ్రూప్‌లో భారత్‌ను కూడా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం
  • 2016 యూరీ దాడి తర్వాత ఆగిపోయిన సార్క్ సమావేశాలు
దక్షిణాసియాలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన సార్క్ కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్‌లు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్ స్థానంలో ఈ కొత్త వేదికను తీసుకురావాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ దౌత్యవేత్తలను ఉటంకిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.

పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం, ఈ కొత్త కూటమి ఏర్పాటుపై చైనా, పాకిస్థాన్‌ల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగానే ఇటీవల చైనాలోని కున్మింగ్ నగరంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సార్క్‌లోని మిగతా దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌లను కూడా ఈ కొత్త కూటమిలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం పెంచుకోవడం ద్వారా ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయాలన్నది ఈ కొత్త గ్రూపు ప్రధాన ఉద్దేశమని ఆ పత్రిక పేర్కొంది.

కొట్టిపారేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఖండించింది. చైనాలో జరిగింది రాజకీయ సమావేశం కాదని, ఎలాంటి కొత్త కూటమిని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎం. తౌఫిద్ హోస్సైన్ మాట్లాడుతూ, “మేము ఏ కొత్త కూటమిని ఏర్పాటు చేయడం లేదు” అని తేల్చిచెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు, ఈ కొత్త గ్రూప్‌లోకి భారత్‌ను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భారత్, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక సభ్యదేశాలుగా ఉన్న సార్క్ కూటమి గత కొన్నేళ్లుగా అచేతనంగా మారింది. 2016లో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సమావేశం యూరీలో ఉగ్రదాడి కారణంగా రద్దయింది. ఆ దాడి నేపథ్యంలో సదస్సులో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్‌లు కూడా భారత్‌కు మద్దతుగా సదస్సును బహిష్కరించాయి. అప్పటి నుంచి సార్క్ సమావేశాలు జరగలేదు.


More Telugu News