ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇక బీఆర్ఎస్ నేతల వంతు!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులైన బీఆర్ఎస్ నేతలకు నోటీసులు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. నవీన్ రావు విచారణకు సిట్ యోచ‌న‌
  • ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావును లాగడం వెనుక ఎమ్మెల్సీ పాత్రపై ఆరా
  • త్వరలో అనుబంధ ఛార్జిషీట్ దాఖలుకు సిట్ సన్నాహాలు
  • కవిత పీఏకు నోటీసుల వార్తలను నిర్ధారించని సిట్ అధికారులు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణ పరిధిని మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ నాయకులను బాధితులుగా విచారించిన సిట్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై దృష్టి సారించింది. ఈ కేసులో బాధితులుగా ఉన్న బీఆర్ఎస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు త్వరలో నోటీసులు జారీ చేసి, వారి వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

బలమైన సాక్ష్యాల సేకరణే లక్ష్యం
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో ఏకంగా 615 మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఇది భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 200 మందికి పైగా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసిన సిట్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల స్టేట్‌మెంట్లతో ప్రభాకర్ రావు పాత్రపై మరింత బలమైన సాక్ష్యాలను సమీకరించాలని భావిస్తోంది. 

కోర్టులో కేసును పటిష్టంగా నిలబెట్టి, నిందితులకు శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా సిట్ వేగంగా అడుగులు వేస్తోంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో నిందితులు మకాం వేసి ట్యాపింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలకు వారి సెల్ టవర్ లొకేషన్లు కీలక ఆధారాలుగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్సీ కె. నవీన్ రావు విచారణకు సిట్ యోచ‌న‌
ఈ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. నవీన్ రావును విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తి, ఓ మీడియా ఛానల్ అధినేత అయిన శ్రవణ్ రావును ఇరికించడం వెనుక నవీన్ రావు పాత్ర ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్నలతో పాటు శ్రవణ్ రావు, నవీన్ రావుల సెల్ టవర్ లొకేషన్లను సిట్ సేకరించింది. నేరం జరిగిన సమయంలో వీరంతా చాలాసార్లు కలుసుకున్నట్లు సాంకేతిక ఆధారాలతో నిర్ధారించుకున్న తర్వాతే నవీన్ రావును విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న నవీన్ రావు, హైదరాబాద్ వ‌చ్చిన వెంటనే సిట్ విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కవిత పీఏకు నోటీసుల వార్తలను నిర్ధారించని సిట్ అధికారులు
ఇప్పటికే ఈ కేసులో ఒక ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసిన సిట్, తాజాగా సేకరిస్తున్న ఆధారాలు, వాంగ్మూలాలతో త్వరలోనే అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు జారీ చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సిట్ ఉన్నతాధికారులు నిర్ధారించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని కవిత సన్నిహిత వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. 


More Telugu News

Kavitha MLC Kavitha Kavitha PA Telangana phone tapping case Praneeth Rao BRS leaders Special Investigation Team Telangana politics Phone tapping investigation Telangana news