ఆమిర్ ఖాన్ కొత్త సినిమా చూసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఈ చిత్రాన్ని చూశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సిబ్బంది, అలాగే చిత్ర బృంద సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ తమ సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా పంచుకుంది. "భారత రాష్ట్రపతి మా చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ వీక్షించడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. సినిమా పట్ల ఆమె చూపిన ఆదరణ, అందించిన ప్రశంసలు మాకు అమూల్యమైనవి. మా బృందం మొత్తం తరఫున ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని చిత్ర నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.

గతంలో ఘన విజయం సాధించిన ‘తారే జమీన్‌ పర్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘సితారే జమీన్‌ పర్‌’ రూపొందింది. మొదటి భాగంలో చదువులో వెనుకబడిన పిల్లలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను ఆవిష్కరించగా, ఈ చిత్రంలో దివ్యాంగులు తమ వైకల్యాలను అధిగమించి ఎలా విజయ తీరాలకు చేరారనే స్ఫూర్తిదాయక కథనాన్ని చూపించారు. ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ కోచ్‌ పాత్రలో, జెనీలియా మరో ముఖ్య పాత్రలో నటించారు. 'సితారే జమీన్‌ పర్‌' చిత్రం జూన్‌ 20న విడుదలైంది.

Draupadi Murmu
Sitare Zameen Par
Aamir Khan
President of India
Genelia D'Souza

More Telugu News