తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు, ఐదు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా, ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.

భారీ వర్ష సూచన నేపథ్యంలో పైన పేర్కొన్న ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.

Telangana Weather
Telangana rains
Hyderabad weather
IMD Hyderabad
Weather forecast Telangana

More Telugu News