కవితతో వేదిక పంచుకున్న ఆర్.కృష్ణయ్యకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

  • బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • పదేళ్ల పాలనలో బీసీలను పట్టించుకోని కవితకు ఇప్పుడు ప్రేమ ఎందుకని ప్రశ్న
  • కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్‌కు పంపిందని వెల్లడి
  • కవితతో వేదిక పంచుకోవద్దని కృష్ణయ్యకు సూచన
  • కేంద్ర బీసీ బిల్లు ఆమోదానికి ప్రధాని అపాయింట్‌మెంట్ కోరదామని కృష్ణయ్యకు ప్రతిపాదన
బీసీ బిల్లు అంశానికి రాజకీయ రంగు పులుముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని కవిత, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి, గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తక్కువ చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.

ఇదే సందర్భంలో, బీసీ రిజర్వేషన్ల కోసం కవిత చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరిన ఎంపీ ఆర్. కృష్ణయ్య వైఖరిపైనా మంత్రి స్పందించారు. "బలహీన వర్గాల కోసం విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసిన పెద్దన్న ఆర్. కృష్ణయ్య అంటే మా అందరికీ ఎంతో గౌరవం ఉంది. అయితే, పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఎలాంటి మేలు చేయని కవిత వంటి వారితో వేదిక పంచుకుని మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు" అని కృష్ణయ్యకు హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వానికి బీసీ బిల్లును పంపామని, దాని ఆమోదం కోసం ఆర్. కృష్ణయ్య చొరవ తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరాలని సూచించారు. అవసరమైతే అందరం కలిసి ప్రధానిని కలుద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించారు.


More Telugu News