ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్

  • ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముమ్మరం
  • సిట్ ముందుకు మాజీ సీఎస్, జీఏడీ కార్యదర్శి
  • కీలక సమాచారం రాబట్టిన సిట్
తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ శాంతి కుమారి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) రఘునందన్ రావులను విచారించారు. వారిద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టి, వాంగ్మూలాలను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనల ప్రకారం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) కింద ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి అధికారిక అనుమతి తప్పనిసరి. దీంతో పాటు, కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబర్ల జాబితాను ముందుగా ఒక రివ్యూ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబీ) సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసేందుకు రివ్యూ కమిటీకి ప్రతిపాదించినట్లు సమాచారం. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాంతి కుమారి, ఆ జాబితాను టెలికం అనుమతుల నిమిత్తం డాట్‌కు పంపారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


More Telugu News

Shanthi Kumari Telangana phone tapping case Telangana politics रघु नंदन राव Special Investigation Team SIT Prabhakar Rao SIB Indian Telegraph Act 1885 Telangana Assembly Elections Telangana Home Department Phone tapping review committee