Houthi rebels: అదే జరిగితే ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేస్తాం... హౌతీల హెచ్చరిక

ఇరాన్‌పై ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విరుచుకుపడుతుండగా, ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే ప్రతి ఒక్కరికీ ప్రమాదం పొంచివున్నట్లేనని ఇదివరకే టెహ్రాన్ హెచ్చరించింది. తాజాగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సైతం అగ్రరాజ్యానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌తో అమెరికా జట్టు కడితే ఎర్రసముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ ఓ వీడియో సందేశంలో తెలిపారు.

అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి ఇటీవల ఓ కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం ఈ యుద్ధంలో పాల్గొంటే పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. 
Houthi rebels
Red Sea
Yemen
Iran
Israel
US military
Middle East conflict
Yahya Saree
Operation Rising Lion
Trump

More Telugu News