Indian Embassy Israel: ఇజ్రాయెల్‌లోని భారతీయులకు జరిమానా ప్రచారంపై స్పందించిన భారత్

ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో జరిమానాలు లేదా జైలు శిక్షలు విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది.

కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక సమాచారం ఇజ్రాయెల్‌లోని భారత పౌరుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రకారం, ప్రతీ భారతీయుడు ఎంబసీలో రిజిస్టర్ చేసుకుని, వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆ సందేశంలో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది.

రాయబార కార్యాలయం వద్ద భారత పౌరుల పేర్ల నమోదు అనేది పూర్తిగా వారి సంక్షేమం కోసమేనని అధికారులు వివరించారు. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు వారిని సులభంగా సంప్రదించడానికి, భారత ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు వారికి అందేలా చూడటానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు. అంతే తప్ప, ఇది తప్పనిసరి కాదని, దీనికి ఎలాంటి జరిమానాలు గానీ, శిక్షలు గానీ ఉండవని స్పష్టం చేశారు. కచ్చితమైన సమాచారం కోసం ఎంబసీ విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Indian Embassy Israel
Israel Indians
Indian citizens Israel
Embassy registration
Fake news Israel

More Telugu News