ఎయిరిండియా బుకింగ్స్‌పై అహ్మదాబాద్ విమాన ప్రమాదం దెబ్బ

Air India Bookings Hit After Ahmedabad Flight Crash
షార్ట్స్‌లో చూడండి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఎయిరిండియా సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ దుర్ఘటన అనంతరం విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్‌లు గణనీయంగా పడిపోయాయని, టికెట్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని పర్యాటక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

లండన్‌కు 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత ప్రయాణికుల్లో భద్రతపై ఆందోళనలు పెరగడంతో ఎయిరిండియా బుకింగ్‌లపై ప్రతికూల ప్రభావం పడిందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) అధ్యక్షుడు రవి గోసైన్ తెలిపారు.

ఆయన అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్గాల్లో 18 నుంచి 22 శాతం, దేశీయ మార్గాల్లో 10 నుంచి 12 శాతం మేర బుకింగ్‌లు తగ్గాయి. మొత్తంగా చూస్తే సుమారు 20 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు.

బుకింగ్‌లు తగ్గడంతో పాటు, విమాన టికెట్ల ధరలు కూడా దిగివచ్చాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా టికెట్ ధరలు 8 నుంచి 12 శాతం వరకు తగ్గగా, అంతర్జాతీయ మార్గాల్లో, ప్రత్యేకించి యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో 10 నుంచి 15 శాతం మేర తగ్గినట్లు రవి గోసైన్ వివరించారు. డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే, ప్రయాణికులను ఆకర్షించేందుకు సంస్థ అనుసరిస్తున్న ప్రోత్సాహక వ్యూహాలు కూడా ధరల తగ్గుదలకు కారణం కావచ్చని ఆయన విశ్లేషించారు.

అంతేకాకుండా, ఇప్పటికే టూర్ ఆపరేటర్ల ద్వారా ఎయిరిండియాలో టికెట్లు బుక్ చేసుకున్న పలువురు ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని గోసైన్ తెలిపారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు చెందినవారు, ఉన్నత శ్రేణి ప్రయాణికులు ఇతర విమానయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ల రద్దు 15 నుంచి 18 శాతం ఉండగా, దేశీయంగా ఇది 8 నుంచి 10 శాతంగా ఉందని ఆయన అంచనా వేశారు. అయితే, ఈ పరిస్థితి స్వల్పకాలికమేనని, రాబోయే రోజుల్లో సాధారణ స్థితి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఈ అభిప్రాయాన్ని బలపరిచారు. ఎయిరిండియా టికెట్ బుకింగ్‌లలో సుమారు 20 శాతం తగ్గుదల కనిపించిందని, టికెట్ ధరలు కూడా దాదాపు 10 శాతం వరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Air India
Air India flight crash
Ahmedabad
flight bookings
ticket prices
aviation industry

More Telugu News