మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. భీమవరంలో నడిరోడ్డుపై వీరంగం

  • కాలేజీ బస్సులో విద్యార్థిపై గుంపుగా దాడి
  • బస్సును వెంబడిస్తూ అసభ్య చేష్టలు
  • భయభ్రాంతులకు గురైన వాహనదారులు 
  • ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థిపై ఈ యువకులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.

బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించారు. బస్సు వెంట పడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Your browser does not support HTML5 video.


More Telugu News