Prabhakar Rao: ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు?... ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్

Prabhakar Rao Phone Tapping Case Investigation Intensified by SIT
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ అధిపతి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం నాలుగోసారి విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సహా మరికొందరు రాజకీయ నాయకులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని ప్రభాకర్ రావును పశ్చిమ మండల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) విజయ్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. 

ప్రభాకర్ రావు బృందం సుమారు 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇదే కేసులో నిన్న (బుధవారం) ప్రణీత్ రావును కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాల ఆధారంగా కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేయాలని సూచించారు? అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిచింది? అనే కీలక కోణాల్లో సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Go Back to Shorts
Prabhakar Rao
Telangana phone tapping case
Telangana
Special Intelligence Bureau
SIB
TPCC
Mahesh Kumar Goud
Praneeth Rao
Phone tapping investigation
Telangana politics

More Telugu News