Mohammad Ahmad Kharis: లెబనాన్ లో హిజ్బుల్లా కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గురువారం సంచలన ప్రకటనలు చేస్తూ, లెబనాన్‌లో హిజ్బుల్లా కీలక కమాండర్‌ను హతమార్చామని, అదే సమయంలో ఇరాన్‌లోని వ్యూహాత్మక అణు స్థావరాలపై భీకర దాడులు ప్రారంభించామని వెల్లడించింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఈ దాడులు కొనసాగుతున్నాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ప్రాంతీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

హిజ్బుల్లా కమాండర్ ఖారిస్‌ ఖతం
దక్షిణ లెబనాన్‌లోని నబతియా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిపిన లక్షిత వైమానిక దాడిలో హిజ్బుల్లా యాంటీ-ట్యాంక్ కమాండర్ మహమ్మద్ అహ్మద్ ఖారిస్‌ను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ గురువారం 'ఎక్స్' వేదికగా ధృవీకరించింది. ఖారిస్, ఇజ్రాయెల్‌పై అనేక దాడులకు ప్రణాళిక రచించాడని, ముఖ్యంగా ఏప్రిల్ 26న మౌంట్ డోవ్ వద్ద జరిగిన యాంటీ-ట్యాంక్ ఫైరింగ్‌లో షరీఫ్ సుఅద్ మరణానికి సూత్రధారి అని ఐడీఎఫ్ ఆరోపించింది. ఇరాన్ అండదండలతో హిజ్బుల్లా సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను సహించేది లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఇరాన్‌పై వైమానిక దాడుల మోత
మరోవైపు, ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో, ఇరాన్‌లోని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక లక్ష్యాలపై 100కు పైగా ఆయుధాలతో విరుచుకుపడినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. అరాక్ ప్రాంతంలోని నిరుపయోగంగా ఉన్న అణు రియాక్టర్‌పై, నతాంజ్‌లోని అణ్వాయుధ అభివృద్ధి కేంద్రంపై బాంబుల వర్షం కురిపించారు. ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యమున్న అరాక్ రియాక్టర్ పునరుద్ధరణను అడ్డుకున్నామని, నతాంజ్‌లో అణ్వాయుధాల తయారీకి కీలకమైన భాగాలను, పరికరాలను ధ్వంసం చేశామని ఐడీఎఫ్ వివరించింది. వీటితో పాటు, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలు, వాయు రక్షణ వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

'ఆపరేషన్ రైజింగ్ లయన్' వ్యూహం
ఇరాన్ అణు కార్యక్రమం తమ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిందని భావిస్తున్న ఇజ్రాయెల్, దానిని నిర్వీర్యం చేసేందుకే 'ఆపరేషన్ రైజింగ్ లయన్' చేపట్టినట్లు ప్రకటించింది. గత శుక్రవారం ప్రధాని నెతన్యాహు ఈ ఆపరేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ దాడులకు టెహ్రాన్ తీవ్రంగా, వేగంగా ప్రతిస్పందించే అవకాశం ఉండటంతో, మధ్యప్రాచ్యం పూర్తిస్థాయి యుద్ధం అంచున నిలిచిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Mohammad Ahmad Kharis
Israel
IDF
Hezbollah
Iran
Lebanon
Operation Rising Lion
Nuclear program
Middle East conflict
Air strikes

More Telugu News