AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆ స్కూల్ విద్యార్థుల కృతజ్ఞతలు.. ఎందుకంటే?

తమ పాఠశాలకు సరైన దారి సౌకర్యం కల్పించినందుకు సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ డివిజన్, చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటరమణతో కలిసి హైడ్రా కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు, కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఆయనకు ఒక మొక్కను బహూకరించారు. "మా బడికి బాట చూపారు సార్" అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గత నెల మే 26వ తేదీన దూద్‌బావి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి, "గౌరవనీయ ముఖ్యమంత్రి.. మా బడికి బాట వేయించండి" అంటూ ఒక ప్లకార్డు పట్టుకుని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆయన ఈ విధంగా తెలియజేశారు. ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా అధికారులు తక్షణమే స్పందించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ ఆదిత్య క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఒక ప్రహరీ గోడ అడ్డంగా ఉందని గుర్తించారు. వెంటనే ఆ ప్రహరీని తొలగించి, జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో అక్కడ రహదారిని నిర్మించారు. అంతేకాకుండా, పాఠశాలకు ఒక గేటును కూడా ఏర్పాటు చేయించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల చిరకాల కోరిక నెరవేరింది. అప్పుడే పాఠశాలలో విద్యార్థులు సంబరాలు జరుపుకుని, హైడ్రా అధికారులకు, ముఖ్యంగా హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు.

ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయులు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, "మీరంతా బాగా చదువుకోవాలి" అని విద్యార్థులకు సూచించారు. దానికి విద్యార్థులందరూ ముక్తకంఠంతో "ఓకే సార్" అని సమాధానమిచ్చారు. ఈ సమస్య పరిష్కారంలో సహకరించిన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు.
AV Ranganath
Hydra Commissioner
Doodh Baavi School
Chilakalaguda
Secunderabad School Road

More Telugu News