ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత.. టెహ్రాన్‌ను వ‌దిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం

  • ఇరాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్రం చర్యలు
  • మొదటి విడతగా 100 మందితో కూడిన బృందం టెహ్రాన్ నుంచి అర్మేనియాకు పయనం
  • ఇరాన్‌లో సుమారు 10 వేల మంది భారతీయులు
  • భూమార్గం ద్వారా ఆర్మేనియా, అజర్‌బైజాన్, తుర్కమెనిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్‌ల మీదుగా స్వదేశానికి
  • భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇరాన్‌లోని భారత ఎంబ‌సీ వెల్లడి
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు తక్షణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సుమారు 100 మంది భారతీయులతో కూడిన మొదటి బృందం ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరింది. 

ఇరాన్‌లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఇతర పౌరులు నివసిస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉండగా, వారిలో 6,000 మంది విద్యార్థులేనని అంచనా. తమ పిల్లల భద్రత గురించి భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో సహకరించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ గగనతలం మూసివేశారు. ఈ కారణంగా భూ సరిహద్దుల ద్వారా భారతీయులను తరలించేందుకు ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. దీంతో ఆర్మేనియా, అజర్‌బైజాన్, తుర్కమెనిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్‌ల మీదుగా వారిని భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండు రోజుల క్రితమే అక్కడి భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని కోరింది. తాజా సమాచారం కోసం ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని కూడా సూచించింది. భారతీయుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే... ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చినప్పుడే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాలు ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులలో భయాందోళనలను మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిలో నెలకొంది. భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, పౌరుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది.


More Telugu News