ఇరాన్ ప్రకటనను ఖండించిన పాక్ రక్షణ మంత్రి

  • ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే పాక్ ప్రతీకారం.. ఇరాన్ కీలక నేత వ్యాఖ్య
  • ఈ వాదనను తోసిపుచ్చిన పాకిస్థాన్ రక్షణ శాఖ
  • ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వాయుధాలపై పాక్ ఆందోళన
  • ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని పిలుపు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఇరాన్ కు మద్దతు ప్రకటించింది. అయితే, ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తామనే ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖండించారు. అదేసమయంలో అణ్వాయుధ లెక్కలను వెల్లడించని ఇజ్రాయెల్ పై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్థాన్ వెంటనే ఇజ్రాయెల్‌పై అణుదాడికి దిగుతుందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి నిన్న సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ తాజాగా స్పందించారు. అణు దాడికి సంబంధించి ఇరాన్ కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అణు ప్రతీకారం గురించి ఎలాంటి చర్చ లేనప్పటికీ, ఇజ్రాయెల్‌తో ఘర్షణ విషయంలో పాకిస్థాన్ ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. టెహ్రాన్‌పై దాడి జరిగిన అనంతరం, "ఇరాన్‌కు అండగా నిలుస్తామని" పాకిస్థాన్ పేర్కొంది. జూన్ 14న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని, లేదంటే ఇరాన్, పాలస్తీనాలకు పట్టిన గతే తమకూ పడుతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలున్న ముస్లిం దేశాలు వాటిని తెంచుకోవాలని, ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సమావేశమై ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.


More Telugu News