విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన సినీ దర్శకుడు

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి మహేశ్ జీరావాలా అదృశ్యం
  • ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో మహేశ్ ఫోన్ గుర్తించిన పోలీసులు
  • భర్త ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన భార్య హేతల్
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన జరిగిన నాటి నుంచి నరోదా ప్రాంతానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు మహేశ్ జీరావాలా కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రమాద స్థలానికి అత్యంత సమీపంలో ఆయన ఫోన్ సిగ్నల్ లభించడంతో, ఆయన కూడా ఈ ప్రమాదంలో మరణించి ఉండవచ్చనే భయంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

మహేశ్ జీరావాలా భార్య హేతల్ తెలిపిన వివరాల ప్రకారం, "ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 1.14 గంటలకు మహేశ్ ఆమెకు ఫోన్ చేశారు. అహ్మదాబాద్‌లోని లా గార్డెన్‌లో ఒకరితో మీటింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పారు. అయితే, ఎంతసేపటికీ ఆయన ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, విమానం కూలిపోయిన ప్రదేశానికి కేవలం 700 మీటర్ల దూరంలో మహేశ్ ఫోన్‌ను గుర్తించారు. 

దీంతో, ఆయన ఈ ప్రమాదంలోనే మరణించి ఉండవచ్చనే అనుమానంతో, నిర్ధారణ కోసం పోలీసులు మహేశ్ కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఆయన సాధారణంగా ఆ దారిలో ఎప్పుడూ ఇంటికి రారు. బహుశా దురదృష్టవశాత్తూ ఆ రోజే ఆ మార్గాన్ని ఎంచుకున్నారేమో" అంటూ హేతల్ కన్నీటిపర్యంతమయ్యారు.


More Telugu News