కేటీఆర్‌కు నోటీసులు... తీవ్రంగా స్పందించిన కవిత

Kalvakuntla Kavitha Condemns Notices to KTR as Political Vendetta
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆమె ఆరోపించారు. కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

"రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. "మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

మరోవైపు, ప్రజా గాయకుడు గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని కవిత తీవ్రంగా విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ గద్దర్ పేరును ప్రస్తావించే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన పేరు మీద ఇస్తున్న సినిమా అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను ముద్రించకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రజా గాయకుడు గద్దర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం, వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరం" అని కవిత పేర్కొన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, ఆయనను గౌరవించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కవిత ఆరోపించారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
KTR Notices
BRS Party
Telangana Politics
Congress Government

More Telugu News