నాకు మొదటి పార్టీ టీడీపీ... చివరిది బీజేపీ: రాజాసింగ్
- బీజేపీని వదిలే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే రాజాసింగ్
- కొందరు తనతో ఆడుకుంటున్నారని, వారిని వదిలిపెట్టనని వ్యాఖ్య
- మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ల వల్లే పార్టీలో ఉన్నానని వెల్లడి
కొంతకాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ, కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. గతంలో తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ, తాను పార్టీ మారే ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. "అప్పుడే నేను వేరే పార్టీలోకి వెళ్లలేదు, ఇప్పుడు కూడా బీజేపీని వీడి వెళ్లను" అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రస్తుతం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల వల్లే బీజేపీలో కొనసాగుతున్నానని, లేకపోతే ఎప్పుడో పార్టీని వీడిపోయేవాడినని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ భారతీయ బీజేపీ అని అన్నారు. ఒకవేళ పార్టీని వీడాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను తప్ప, మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్న వారిని కూడా వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు.