Chandrababu Naidu: సంక్షేమ పథకాల జోరు.. అభివృద్ధి పనుల్లో వేగం: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం

Chandrababu Naidu Government Completes One Year Focusing on Welfare and Development
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో గురువారంతో ఏడాది పూర్తి చేసుకుందని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రతిరోజూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

గడిచిన ఏడాది కాలంలో అనేక ఆర్థిక సవాళ్లు, సమస్యలను అధిగమించి పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమల్లోకి తెచ్చినట్టు చంద్రబాబు వివరించారు. 'పేదల సేవలో', 'పెన్షన్లు', 'అన్న క్యాంటీన్లు', 'దీపం-2', 'తల్లికి వందనం', 'మత్స్యకార సేవలో' వంటి ఎన్నో పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చామని తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పనకు పటిష్టమైన అడుగులు వేశామని చంద్రబాబు వివరించారు. రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, 55 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పలు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను, పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతం చేశామని పేర్కొన్నారు. దీంతోపాటు, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్‌ను సాధించామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించామని వివరించారు.

ప్రజల ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాది పాలన విజయవంతం కావడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సుపరిపాలనలో తాము వేసిన ఈ తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని, మలి అడుగు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP Government
Welfare Schemes
Development Programs
Pension Scheme
Anna Canteens
Irrigation Projects
Polavaram Project
Visakha Steel Plant

More Telugu News