Narendra Modi: కరోనా ఎఫెక్ట్.. ప్రధాని మోదీతో భేటీ కావాలంటే ఈ టెస్టు తప్పనిసరి

Narendra Modi Meeting Requires Mandatory Covid Test
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

తాజాగా నమోదవుతున్న కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలు దాటింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,121కి చేరింది. ఇప్పటివరకు దేశంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 74కు పెరిగింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా పీఎంఓ అధికారులు చేస్తున్నారని సమాచారం.

దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,121 యాక్టివ్ కేసుల్లో కేరళలో అత్యధికంగా 2,223 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ (1,223), ఢిల్లీ (757), పశ్చిమ బెంగాల్ (747), మహారాష్ట్ర (615), కర్ణాటక (459) రాష్ట్రాలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 72 యాక్టివ్ కేసులు ఉండగా, తెలంగాణలో 11 కేసులు నమోదయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లో 229, తమిళనాడులో 204, రాజస్థాన్‌లో 138, హర్యానాలో 125, మధ్యప్రదేశ్‌లో 65, ఛత్తీస్‌గఢ్‌లో 48, బీహార్‌లో 47, ఒడిశాలో 41, సిక్కిం, పంజాబ్‌లలో ఒక్కో రాష్ట్రంలో 33 చొప్పున కేసులు ఉన్నాయి. పుదుచ్చేరి, ఝార్ఖండ్‌లలో చెరో 10, జమ్ముకశ్మీర్‌లో 9, అసోం, గోవాలలో 6 చొప్పున, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లలో 3 చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2, మణిపుర్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Narendra Modi
Covid-19
Coronavirus
RTPCR Test
PMO
India Covid Cases
Health Ministry

More Telugu News