భర్తను హంతకులకు అప్పగించిన భార్య.. హనీమూన్ హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • మేఘాలయ హనీమూన్‌లో ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్య
  • భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా హత్యకు ప్లాన్
  • అలసిపోయినట్లు నటించి.. భర్తను హంతకులకు అప్పగించిన భార్య
  • ఆ త‌ర్వాత‌ 'చంపేయండి' అని భార్య కేకలు వేసినట్లు ఆరోపణ
  • యూపీ ఘాజీపూర్‌లో సోనమ్‌ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఈ కేసులో ఇప్పటివరకు సోనమ్‌తో సహా ఐదుగురు అరెస్ట్
  • పెళ్లైన కొద్ది రోజులకే హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల అనుమానం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతుల హనీమూన్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మేఘాలయలోని అందమైన కొండ ప్రాంతాల్లో మొదలైన వారి కొత్త జీవితం, భర్త హత్యతో భయానక క్రైమ్ థ్రిల్లర్‌గా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివ‌రికి భార్య సోనమ్, ఆమె ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను అంత‌మొందించిన‌ట్లు తెలిసి అంద‌రూ నిర్ఘాంత‌పోయారు. ఇప్పుడు, దర్యాప్తులో వెలుగు చూస్తున్న వివరాలు హత్య వెనుక ఉన్న ప్రణాళిక, అమలు, నాటకీయ పరిణామాలను బయటపెడుతున్నాయి.

విచారణ వర్గాల కథనం ప్రకారం... మే 20న ఈ నూతన దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు బయలుదేరారు. వన్-వే టికెట్‌తో ప్రయాణించిన వీరిని, ముగ్గురు హంతకులు రహస్యంగా అనుసరించినట్లు తెలుస్తోంది. తొలుత కశ్మీర్‌లో హనీమూన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ, అక్కడ ఉగ్రదాడుల వార్తల నేపథ్యంలో ప్రదేశాన్ని మేఘాలయకు మార్చుకున్నారని సమాచారం. మేఘాలయలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన వీరు, మే 22న నోంగ్రియాట్ గ్రామంలోని ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జెస్‌ను చూసి, అక్కడే రాత్రి బస చేశారు.

మే 23న ఉదయం హోమ్‌స్టే నుంచి చెక్-అవుట్ చేసిన దంపతులు, అద్దెకు తీసుకున్న స్కూటర్‌పై సందర్శనీయ స్థలాలకు బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. ఈ సమయంలో సోనమ్ తాను అలసిపోయినట్లు నటిస్తూ, భర్త వెనుక నడిచిందని, ఆపై హంతకులను ఉద్దేశించి 'అతన్ని చంపేయండి' అని అరిచిందని దర్యాప్తులో వెల్లడైంది. 

కొన్ని రోజుల తర్వాత, రాజా మృతదేహం ఓ లోయ‌లో లభ్యమైంది. పోలీసులు సోనమ్ కదలికలను ట్రేస్ చేసి, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఒక రోడ్డు పక్కన ఉన్న తినుబండారాల దుకాణం వద్ద ఆమెను గుర్తించారు. తనకు మత్తుమందు ఇచ్చారని, ఘాజీపూర్‌కు ఎలా వచ్చానో తనకు తెలియదని సోనమ్ వాదిస్తోంది. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే సోనమ్, ఆమె ప్రియుడిగా భావిస్తున్న రాజ్ కుష్వాహా ఈ హత్యకు పథకం పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు సోనమ్‌తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం షిల్లాంగ్‌కు తరలించనున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను సేకరిస్తూ, ఘటన జరిగిన తీరును నిర్ధారించే పనిలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.


More Telugu News