అమెరికా ఘటనపై కేంద్రం మౌనం.. జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు

విదేశాల్లో భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోని ఒక విమానాశ్రయంలో భారతీయ యువకుడిని అక్కడి భద్రతా సిబ్బంది అమానుషంగా నేలపై పడేసి, చేతులు వెనక్కి విరిచి బంధించిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

"భారతీయుల గౌరవాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ తరచూ విఫలమవుతున్నారు" అని జైరాం రమేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. "చరిత్రలో తొలిసారిగా ఒక విదేశీ అధినేత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. భారత్‌పై ఒత్తిడి తెచ్చి తాము కాల్పుల విరమణ చేయించామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. అమెరికాలో భారతీయులకు అవమానాలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనం వీడటం లేదు" అని ఆయన ఆరోపించారు.

ప్రధాని బాధ్యతల్లో భారతీయుల గౌరవాన్ని కాపాడటం అత్యంత కీలకమైన అంశమని జైరాం రమేశ్ అన్నారు. అమెరికాలో మనవాళ్లపై జరుగుతున్న దాడుల గురించి అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ తక్షణమే మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే?

అమెరికాలోని ఒక విమానాశ్రయంలో భారతీయ యువకుడి పట్ల అక్కడి భద్రతా సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. యువకుడిని నేలపై పడేసి, చేతులు వెనక్కి విరిచి కట్టేసి నిర్బంధించారు. అనంతరం అతడిని బలవంతంగా భారత్‌కు తిప్పి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి 'ఎక్స్'లో పోస్ట్ చేసి, భారత రాయబార కార్యాలయాన్ని, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Jairam Ramesh
Indian youth America
Indian citizen assault
US airport incident

More Telugu News