Nara Lokesh: 1100 మంది కార్యకర్తలతో ఫొటోలు దిగిన నారా లోకేశ్

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, పార్టీ కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. 'కార్యకర్తే అధినేత' అనే పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపుతూ, పార్వతీపురం నియోజకవర్గంలోని చినబొండపల్లిలో కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ సమన్వయ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రి లోకేశ్ అక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తను పేరుపేరునా పలకరించి, వారితో కలిసి ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా సుమారు 1100 మంది కార్యకర్తలు మంత్రి నారా లోకేశ్ ను కలుసుకునే అవకాశం దక్కింది. ప్రతి ఒక్కరితోనూ మంత్రి ఆప్యాయంగా మాట్లాడుతూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కేవలం ఫొటోలకే పరిమితం కాకుండా, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వారు అందించిన వినతులను లోకేశ్ ఓపికగా స్వీకరించారు.

కార్యకర్తలు లేవనెత్తిన ప్రతి సమస్యను సానుకూలంగా విన్న మంత్రి, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకమని, వారి సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
AP Politics
Parvathipuram
Chinnabondapalli
TDP
Party Workers
Welfare Schemes
IT Minister
Education Minister

More Telugu News