ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల... అబ్బాయిలదే హవా!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు జూన్ 08, 2025న విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో ప్రకటించిన టాప్-10 ర్యాంకులన్నీ అబ్బాయిలే దక్కించుకోవడం గమనార్హం.

ఇంజినీరింగ్‌లో టాపర్లు వీరే...

ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్‌ రెడ్డి 96.39 స్కోరుతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్‌ రెడ్డి 95.57 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ 94.75 స్కోరుతో మూడో ర్యాంకులో నిలిచారు.

తర్వాతి స్థానాల్లో నంద్యాల జిల్లా తిమ్మాపురానికి చెందిన యు. రామచరణ్‌ రెడ్డి నాలుగో ర్యాంకు, అనంతపురం న్యూటౌన్‌కు చెందిన భూపతి నితిన్‌ అగ్నిహోత్రి ఐదో ర్యాంకు, గుంటూరు వాస్తవ్యులు టి.విక్రమ్‌ లేవి ఆరో ర్యాంకు దక్కించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన దేశిరెడ్డి మణిదీప్‌ రెడ్డి ఏడో ర్యాంకు, హన్మకొండ వడ్డేపల్లికి చెందిన ఎస్‌. త్రిశూల్‌ ఎనిమిదో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి తొమ్మిదో ర్యాంకు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌ పదో ర్యాంకు సాధించి సత్తా చాటారు.

అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలోనూ ఉత్తమ ప్రతిభ

అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలోనూ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ విభాగంలో కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్‌ మొదటి ర్యాంకు సాధించారు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన షన్ముఖ నిశాంత్‌ అక్షింతల రెండో ర్యాంకు, కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన డేగల అకీరనంద వినయ్‌ మల్లేశ్‌ కుమార్‌ మూడో ర్యాంకు పొందారు.

ఇక ఇతర టాప్ ర్యాంకర్లలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన వై.షణ్ముఖ్‌ నాలుగో ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన యెలమోలు సత్య వెంకట్‌ ఐదో ర్యాంకు, కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్‌ ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నారు. విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన జి. లక్ష్మీ చరణ్‌ ఏడో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి ఎనిమిదో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా చాగళ్లుకు చెందిన కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ తొమ్మిదో ర్యాంకు, కాకినాడ జిల్లా తొండంగికి చెందిన దేశిన సూర్య చరణ్‌ పదో ర్యాంకు సాధించారు. ఈఏపీసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందిస్తున్నారు.


More Telugu News