Chandrababu Naidu: అనంతవరంలో మొక్కలు నాటిన చంద్రబాబు... కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

Chandrababu Naidu plants trees in Anantavaram Pawan Kalyan attends
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అనంతవరం ఏడీసీఎల్ పార్క్‌లో  జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వెయ్యి మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో నేడు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించబోతోందని అన్నారు.

ఒకే రోజు కోటి మొక్కలు, ఏడాదికి ఐదు కోట్లు లక్ష్యం

ఈరోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని, ఈ సంవత్సరం మొత్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. "ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. మన మిత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నేడు నాడుతున్నాం. ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం" అని వివరించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం (గ్రీన్ కవర్) సాధించడమే అంతిమ లక్ష్యమని, ఇది సాకారమైతే దాని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని, ఈ విషయంలో దేశానికే కాకుండా ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

పర్యావరణ దినోత్సవం – ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన

1972 నుంచి జూన్ 5వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేస్తూ, ఈ ఏడాది 'ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి' (End Plastic Pollution) అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించి, రీసైకిల్ వంటి పద్ధతుల ద్వారా దానిని ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ఉద్దేశమని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం – ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రణాళిక

ప్రస్తుతం రాష్ట్రంలో 36,742 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉందని, ఇది రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో 22.96 శాతం అని చంద్రబాబు తెలిపారు. "మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, రాయలసీమలో నల్లమల అడవులు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల మైదాన ప్రాంతాల్లో కూడా చెట్లు పెరుగుతున్నాయి, పచ్చదనం వృద్ధి చెందింది" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం గ్రీన్ కవర్ 30.05 శాతంగా ఉందని, దీనిని 50 శాతానికి తీసుకెళ్లడమే అందరి లక్ష్యమని పునరుద్ఘాటించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లు నాటడంపై అవగాహన లేకుండా వ్యవహరించిందని, కేవలం ఫోటోల కోసమే మొక్కలు నాటి వదిలేసేవారని విమర్శించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంపై శ్రద్ధ చూపలేదని, చెట్ల వల్ల ఉపయోగం తెలియక నరకడానికే ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh
Anantavaram
Planting trees
World Environment Day
Green cover
Plastic pollution
AP government
ADCEL Park

More Telugu News