తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఈ మార్పు గమనించారా?

  • తత్కాల్ టికెట్ బుకింగ్ కు త్వరలో ఇ-ఆధార్ అథంటికేషన్
  • కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 
  • నిజమైన వినియోగదారులకు కన్ఫామ్ టికెట్లు పొందేందుకు వీలు కలుగుతుందన్న మంత్రి
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. త్వరలో తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఇ-ఆధార్ అథంటికేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పెంపొందించడం, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, మోసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నూతన విధానం ఈ నెలలోనే అమలులోకి రానుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ మోసాలను అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ ఇప్పటికే సుమారు 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను రద్దు చేసింది. బాట్స్ మరియు ఏజెంట్ల ద్వారా జరుగుతున్న మోసాలను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నారు.

ఈ తాజా విధానం ద్వారా నిజమైన వినియోగదారులకు కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అత్యవసర ప్రయాణికులకు ఇ-ఆధార్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఆధార్ అనుసంధానం ద్వారా ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ముందుగానే నమోదు చేయబడతాయి. ఇది బుకింగ్ సమయంలో సమయాన్ని ఆదా చేస్తుంది.

అదేవిధంగా, టికెట్ రద్దు సమయంలో రీఫండ్ ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది. ప్రయాణికులు తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. 


More Telugu News