Odisha Hospital Deaths: ఒడిశా ఆసుపత్రిలో ఘోరం.. ఇంజెక్షన్ తర్వాత ఐదుగురు రోగుల మృతి!

Odisha Hospital Tragedy Five Die After Alleged Wrong Injection
షార్ట్స్‌లో చూడండి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వైద్య సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. "అర్ధరాత్రి సమయంలో ఒక నర్సు మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చింది. మా సోదరికి కూడా అదే ఇంజెక్షన్ వేసింది. అది వేసిన కొన్ని క్షణాల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. మేము డాక్టర్‌ను పిలిచి, ఆయన వచ్చి పరీక్షించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది" అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన వారందరూ అంతకుముందు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, ఆపరేషన్ల అనంతరం వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బంధువులు పేర్కొన్నారు. అయితే, నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  
Go Back to Shorts
Odisha Hospital Deaths
Koraput
Hospital Deaths
Medical Negligence
Injection Reaction
Patient Deaths
Odisha News
Lakshman Nayak Medical College

More Telugu News