మరొకరితో మాట్లాడుతోందని ప్రియురాలిని కసిదీరా పొడిచి చంపిన ప్రియుడు!

  • యూపీలోని మొరాదాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణ హత్య
  • మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని వ్యక్తి ఘాతుకం
  • శరీరంపై 40కి పైగా పోట్లు
  • ప్రైవేటు భాగాలపై కూడా దాడి
  • గొంతు నులిమి, ఆపై స్క్రూడ్రైవర్‌తో పొడిచినట్లు నేరం అంగీకారం
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆమె, ఆదివారం మైనాథెర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెలుపల ఉన్న మొక్కజొన్న చేనులో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సోమవారం విడుదలైన పోస్టుమార్టం నివేదికలో హత్య ఎంత క్రూరంగా జరిగిందో వెల్లడైంది. యువతి శరీరంపై, ప్రైవేటు భాగాలతో సహా మొత్తం 40కి పైగా స్క్రూడ్రైవర్‌తో పొడిచిన గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. తీవ్ర రక్తస్రావం వల్లే ఆమె మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఈ దారుణానికి పాల్పడింది 20 ఏళ్ల మహమ్మద్ రఫీ అని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. తాను యువతికి ప్రియుడిని అని, గత మూడు నెలలుగా ఆమె వేరొక వ్యక్తితో మాట్లాడుతుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని రఫీ చెప్పినట్లు పోలీసులు వివరించారు.

మొదట యువతి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించానని, ఆమె స్పృహతప్పి పడిపోయాక, స్క్రూడ్రైవర్‌తో ఊపిరి ఆగిపోయేంతవరకూ కసిదీరా పొడిచానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాలేదని, అయితే ప్రతీకార చర్యగా యువతి ప్రైవేటు భాగాలపై స్క్రూడ్రైవర్‌తో అనేకసార్లు పొడిచినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆమె మెడపై కూడా లోతైన కోత ఉందని పేర్కొన్నారు.

మైనాథెర్ ఎస్‌హెచ్‌ఓ కరన్ పాల్ సింగ్ మాట్లాడుతూ, "నిందితుడు కోళ్ల వ్యాపారి. గత ఏడాది కాలంగా ఆ యువతితో పరిచయం ఉందని, ఆమెకు ఒక మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్నాడు" అని తెలిపారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రఫీపై పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. "మేకలకు మేత తేవడానికి వెళుతున్నానని చెప్పి నా కూతురు శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో మేమంతా వెతకడం మొదలుపెట్టాం. మొక్కజొన్న చేనులో నా కూతురు హత్యకు గురైన విషయం తెలిశాక పోలీసులకు సమాచారం ఇచ్చాం. మహమ్మద్ రఫీ తరచూ నా కూతురిని వేధించేవాడు, తనతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ హత్యలో అతని ప్రమేయం ఉందని మాకు అనుమానంగా ఉంది" అని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఈ కేసులో త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం" అని ఎస్‌హెచ్‌ఓ కరన్ పాల్ సింగ్ వెల్లడించారు. 


More Telugu News