Sripadmavati: పదవీ విరమణ రోజే ప్రభుత్వ వైద్యురాలికి షాక్.. అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్

తమిళనాడులో ఓ ప్రభుత్వ వైద్యురాలు పదవీ విరమణ చేయాల్సిన రోజే సస్పెన్షన్‌కు గురికావడం కలకలం రేపింది. అవినీతి ఆరోపణలు, నకిలీ ధ్రువపత్రం సమర్పించడం వంటి కారణాలతో ఆరోగ్యశాఖ ఈ కఠిన చర్యలు తీసుకుంది. బాధితురాలు డాక్టర్ శ్రీపద్మావతి గతంలో తెన్కాశి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేసిన సమయంలో ఈ అవకతవకలకు పాల్పడినట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే.. డాక్టర్ శ్రీపద్మావతి తెన్కాశి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు రోగులకు ఆహారం అందించేందుకు అవసరమైన ఆకుకూరల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.25 విలువ చేసే ఒక్కో ఆకుకూర కట్టను రూ.80 చొప్పున కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించారని విచారణలో నిర్ధారణ అయింది.

కొన్ని నెలల క్రితం శ్రీపద్మావతి తెన్కాశి ఆసుపత్రి నుంచి తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి పరిపాలనాధికారిగా బదిలీ అయ్యారు. కాగా, నిన్న (మే 31న) ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, గతంలో పనిచేసిన ఆసుపత్రి నుంచి ఎలాంటి ఆరోపణలు లేవని ధ్రువీకరించే పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) సమర్పించాలని తూత్తుకుడి ఆసుపత్రి వైద్యాధికారులు ఆమెను కోరారు. అయితే, శ్రీపద్మావతి నకిలీ ధ్రువపత్రాన్ని అధికారులకు అందజేశారు.

ఆ పత్రంపై అనుమానం వచ్చిన తూత్తుకుడి వైద్యాధికారులు, తెన్కాశి ఆసుపత్రిలో క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీపద్మావతి సమర్పించింది నకిలీ ధ్రువపత్రమేనని స్పష్టమైంది. దీంతో ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీంతో ఆరోగ్యశాఖ డాక్టర్ శ్రీపద్మావతిని సస్పెండ్ చేస్తూ శనివారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేయాల్సిన రోజే ఇలా సస్పెన్షన్‌కు గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Sripadmavati
Tamil Nadu
government doctor
suspension
corruption charges
fake certificate
Tenkasi
Thoothukudi
health department
retirement

More Telugu News