గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు... చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Godavari River Tragedy Chandrababu Pawan Kalyan Express Grief
కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, కె.గంగవరం మండలం శురుల్లంక గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి పలువురు యువకులు హాజరయ్యారు. వీరిలో 11 మంది సరదాగా స్నానం చేసేందుకు సమీపంలోని కమినిలంక వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే, వారు దిగిన ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు.

గల్లంతైన యువకులను కాకినాడ, రామచంద్రపురం, మండపేట ప్రాంతాలకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

ఈ దురదృష్టకర ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కోనసీమ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్లంతైన యువకులను రక్షించేందుకు తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాలింపు చర్యల పురోగతిని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.

అలాగే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కూడా కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ, అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Godavari River
Konaseema district
Pawan Kalyan
youth drowned
missing persons
Andhra Pradesh news
river accident
search operation
K Gangavaram

More Telugu News