కేర‌ళ‌ను తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు.. 8 రోజుల ముందే దేశంలోకి ప్ర‌వేశం

  • అంచ‌నాల కంటే ముందుగానే రుతుప‌వ‌నాలు రావ‌డం 16 ఏళ్ల‌లో ఇదే తొలిసారి
  • చివ‌రిసారిగా 2009లో మే 23నే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 
  • గతేడాది మే 30న దేశంలోకి ప్ర‌వేశించిన రుతుపవనాలు  
  • కానీ, ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేసిన వైనం
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది సాధార‌ణం కంటే ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ వెల్ల‌డించింది. మ‌రో రెండు మూడు రోజుల్లో ఏపీలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది. 

వీటి ప్ర‌భావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలాఉంటే.. అంచ‌నాల కంటే ముందుగానే రుతుప‌వ‌నాలు రావ‌డం 16 ఏళ్ల‌లో ఇదే మొద‌టిసారి. చివ‌రిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ, ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేశాయి.  

కాగా, 2023లో వారం రోజులు ఆల‌స్యంగా జూన్ 8న‌ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అలాగే 2022లో మే 29న, 2021లో జూన్ 3న‌, 2020లో జూన్ 1న నైరుతి రుతుప‌వ‌నాలు దేశంలోకి ప్ర‌వేశించాయి. ఇక‌, ఈసారి సాధార‌ణం కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.  

అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం
అరేబియా మహాసముద్రంలో ద‌క్షిణ కొంక‌ణ్ తీరానికి స‌మీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంట‌కు ఆరు కిలోమీటర్ల వేగంతో తూర్పువైపు క‌దులుతోంది. మ‌రికొన్ని గంట‌ల్లో ఇది ర‌త్న‌గిరి, ద‌పోలి మ‌ధ్య ద‌క్షిణ కొంక‌ణ్ తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. దీని ప్ర‌భావంతో ప‌శ్చిమ తీరంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.  

ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


More Telugu News